భారత్‌, రొమేనియా మ్యాచ్‌ డ్రా


భారత బాలికల ఫుట్‌బాల్‌ జట్టు చక్కటి ప్రదర్శన కనబరిచింది. రొమేనియాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ను మన అమ్మాయిలు ‘డ్రా’ చేసుకున్నారు. టర్కీ వేదికగా ఆదివారం జరిగిన పోరులో భారత్‌  3-3తో రొమేనియాకు దీటుగా బదులిచ్చింది. మన జట్టు తరఫున మరియమ్మల్‌ బాలమురుగన్‌ డబుల్‌ గోల్స్‌తో మెరిస్తే.. సుమతి కుమారి ఓ గోల్‌ నమోదు చేసింది. ఆరంభంలోనే మనవాళ్లు పైచేయి సాధించడంతో ఒక దశలో గెలుపు ఖాయం అనిపించగా.. చివర్లో తేరుకున్న ప్రత్యర్థి వరుసగా రెండు గోల్స్‌ చేసి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. ఇరుజట్ల మధ్య బుధవారం రెండో ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరుగనుంది.